నగదు లావాదేవీలలో డిజిటలైజేషన్ ఓ విప్లమాత్మక మార్పు. డిజిటలైజేషన్తోపాటు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డిజిటైలజేషన్ వల్ల ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో.. కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇతరులకు, మనకు తెలియని వ్యక్తికి క్యాష్ బదిలీ చేస్తేనే సమస్యలు తలెత్తుతాయి.
చకచకా నగదు బదిలీ
ఇప్పుడు మన వాళ్లకు నగదు బదిలీ చేయాల్సి వస్తే.. అలా చెప్పగానే ఇలా కంప్యూటర్ ముందు కూర్చుని కానీ.. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో కానీ చకచకా వారి ఖాతా, ఫోన్ నంబర్ నమోదు చేస్తే అవసరమైన మనీ బదిలీ అయిపోతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో మొదలైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)కే ఈ ఘనత దక్కుతుంది.
యూపీఐ ద్వారా పెరిగిన నగదు బదిలీ ట్రాన్సాక్షన్లు
రోజురోజుకు యూపీఐ ద్వారా నగదు బదిలీ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 88 శాతం పెరిగాయి. పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చంట్ లావాదేవీలు నమోదవుతున్నాయి. 1965 కోట్ల అధిక లావాదేవీల్లో రూ.13.5 లక్షల కోట్లు చేతులు మారాయి.
రూ.లక్ష వరకు మొబైల్ యాప్స్తో..
ఒక రూపాయి నుంచి రూ.లక్ష వరకు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూపీఐ సేవలందిస్తున్న గూగుల్ పే లేదా జీ-పే, ఫోన్పే, భారత్ పే, పేటీఎం, భీమ్, అమెజాన్ తదితర యాప్లతో క్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది.. మీరు మనీ పంపే వ్యక్తి ఫోన్ నంబర్ లేదా బ్యాంకు ఖాతా నంబర్లో ఏమాత్రం తప్పు నమోదు చేసినా వేరే వ్యక్తుల ఖాతాల్లో జమ అవుతాయి డబ్బులు.
ఇతరులకు క్యాష్ బదిలీతో సమస్య
ఇతరులకు, మనకు తెలియని వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేయడంతోనే సమస్య మొదలవుతుంది. సదరు వ్యక్తులు వెంటనే విత్ డ్రా చేసుకోవచ్చు. మనకు తెలియని వ్యక్తికి పంపిన మనీ.. ఆ వ్యక్తి విత్ డ్రా చేసుకుంటే ఇక మన మనీకి ఆశలు వదులుకోవాల్సిందే. కొద్దిమొత్తం ట్రాన్స్ఫర్ అయితే ఏమీ కాకపోవచ్చు కానీ, భారీగా నగదు బదిలీ అయితే ఆ కష్టం, బాధ మాటల్లో చెప్పడం అంత తేలిక్కాదు మరి. ఇలా పొరపాటుగా ఇతరులకు మనీ పంపిన వారికి భద్రత కల్పించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చింది.
ఇతరుల ఖాతాల్లోకి బదిలీ అయితే చేయండిలా
ఆ గైడ్లైన్స్ ప్రకారం.. పొరపాటున ఇతర వ్యక్తుల ఖాతాల్లో మీరు ట్రాన్స్ఫర్ చేసిన క్యాష్ గురించి మీరు బదిలీ చేయడానికి ఉపయోగించిన మొబైల్ యాప్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి.. అంటే పేటీఎం, జీ-పే, ఫోన్పే, భారత్ పే వంటి సంస్థల యాజమాన్యాలకు ఫిర్యాదు చేయాలన్న మాట. ఎన్పీసీఐ వైబ్సైట్లోనూ బాధితులు కంప్లయింట్ చేయొచ్చు.
బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయొచ్చు
యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ, వర్చువల్ పేమెంట్ అడ్రస్, బదిలీ చేసిన సొమ్ము, ట్రాన్స్ఫర్ చేసిన తేదీ, బాధితుడి ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ ఫోన్ నంబర్ తదితర వివరాలు ఆ ఫిర్యాదులో పేర్కొనాలి. తన బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ వివరాలు జత చేయాలి. అలా చేయడం వల్ల క్యాష్ ట్రాన్స్ఫర్ విషయం ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో తెలుస్తుంది. ఫిర్యాదీ దారుడు తన ఫిర్యాదులో పొరపాటున క్యాష్ ట్రాన్స్ఫర్ అయిందని స్పష్టంగా తెలుపాలి. అలా చేసిన తర్వాత సరైన టైంలో క్యాష్ మన ఖాతాలో జమ కాకపోతే పేమెంట్ సర్వీస్ బ్యాంకుకు, తర్వాత బ్యాంకింగ్ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
క్యాష్ వెనక్కి తీసుకునే పరిస్థితులు మెరుగు
గతంతో పోలిస్తే పొరపాటున ట్రాన్స్ఫర్ అయిన నగదు వెనక్కు రావడానికి పరిస్థితులు మెరుగయ్యాయని ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీవోవో ఆశీష్ మిశ్రా తెలిపారు. ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో దాని స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు.