‘ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ ఖచ్చితంగా ఫైల్ చేయాలా? లేకపోతె వచ్చే నష్టమేంటి?”2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల దాఖలుకున్న గడువు ఈ వారంతో ముగుస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశంలో దాదాపు 50 కోట్ల పాన్ కార్డులున్నాయి. అయితే ఇందులో గరిష్ఠంగా 10 శాతమే రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. వీరిలో కూడా ఎక్కువమంది ఉద్యోగులే. కానీ ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల వచ్చే లాభాలే ఎక్కువ. నిజానికి ఐటీఆర్ అనేది మన ఆదాయానికి సంబంధించి ఓ ప్రూఫ్గా పనికొచ్చే అంశమే అయినా.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రుణాలు ఈజీ
బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వాలంటే మొదటగా అడిగేది ఐటీ రిటర్న్స్నే. వీటివల్ల రుణగ్రహీత వ్యక్తిగత ఆదాయం ఎంతో సరిగ్గా ఓ అవగాహనకు సంస్థ వస్తుంది. అందుకే వాహన, వ్యక్తిగత, గృహ రుణాలు తీసుకున్నప్పుడు రిటర్న్స్ ఉపయోగపడతాయ్.
విదేశీయానం సులువు
కొంతమందికి పెద్దగా చదువు ఉండదు. వాళ్లకు పాస్పోర్టులు, వీసాలు రావడం బాగా కష్టం. అటువంటప్పుడు ఈ ఐటీ రిటర్న్స్ పనికొస్తాయి. కాన్సులేట్లు, ఎంబసీలు మన ఆదాయాన్ని అంచనా వేసి వీసాలను ప్రాసెస్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
నష్టాలను కవర్ చేసుకోవచ్చు
నిరుడు వ్యాపారంలోనో, లేక ఏదైనా కారణాలతోనో నష్టాలొస్తే.. ఈసారి లాభాల్లో వాటిని పూడ్చుకునే అవకాశం ఐటీఆర్తో ఉంటుంది. ఔట్ స్టాండింగ్ ఖర్చులు కూడా వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం గడువులోగా రిటర్న్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
పెనాల్టీ బాధ తప్పుతుంది
ఒకవేళ గడువులోపు రిటర్న్స్ దాఖలు చేయకపోతే.. ఐటీ శాఖ అధికారులకు మనపై రూ.5వేల వరకూ పెనాల్టీ విధించే అధికారం ఉన్నది. అంతేకాదు మనకు బ్యాంకుల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఒక స్థాయి దాటితే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. వాటిని మనం తిరిగి పొందాలంటే కూడా గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల ఇక్కడ లాభాలు కొన్నే కనిపిస్తున్నప్పటికీ.. అవి ముఖ్యమైనవి. రుణాలు ఎప్పుడు?.. ఎవరికి?.. ఎలా?.. అవసరం అవుతాయో తెలీదు. వాటిని పొందాలన్నప్పుడు ఖచ్చితంగా ఐటీఆర్ అవసరం ఉంటుంది. అప్పటికప్పుడు వాటిని సమర్పించడం కుదిరేపని కాదు. అందుకే ముందస్తుగా మనం ప్లాన్ చేసుకుని రిటర్న్స్ దాఖలు చేసి పెట్టుకుంటే మంచిది. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఆదాయం తక్కువగా ఉన్నాసరే ఈ నెల 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయండి. ఇవి ఎప్పుడో ఒకసారి మనకు పనికొస్తాయి. అంతే కాదు పన్ను పరిధిలో ఉన్నవాళ్లు.. సరైన సమయంలో రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల వాటిల్లో అవసరమైనప్పుడు కరెక్షన్స్ చేసుకోవడానికి, టీడీఎస్ రిటర్న్స్ పొందడానికి, పెనాల్టీ నుంచి తప్పించుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి.
ఆదాయం రూ.3 లక్షలలోపే.. ఐటీఆర్ ఫైల్ చేయాలా?
మనలో చాలామంది మదిలో ఉండే మొదటి ప్రశ్న ఇదే. నెలకు రూ.20వేల జీతం కూడా లేనప్పుడు ఈ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలి? అని అనుకుంటారు. కానీ ఇది తప్పు. మన జీతాలు, ఆదాయం.. ఐటీ శాఖ పన్ను పరిధి కంటే తక్కువగా ఉన్నప్పటికీ మనం రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. దీన్నే నిల్ రిటర్న్స్ అంటాం. ఇది ఫైల్ చేశారంటే ఆదాయం తక్కువగా ఉందని అర్థం. నిజానికి వార్షికంగా మన ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే రిటర్న్స్ ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిన అవసరం ఉండబోదు. కానీ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఎక్కువ. ఒకవేళ ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిధిలో ఉన్నవాళ్లు మాత్రం ఖచ్చితంగా రిటర్న్స్ ఫైల్ చేయాలి. వారేవరంటే.. ఏటా రూ.1 లక్షకు మించి విద్యుత్తు బిల్లులు చెల్లించినా, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసినా, కరెంట్ ఖాతాల్లో రూ.కోటికి మించి డిపాజిట్ చేసినా వారంతా ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే.
రిటర్న్స్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా పన్ను కట్టాలన్న భయంతో చాలా మంది ఐటీఆర్ ఫైలింగ్ కి వెనుకాడతారు. అది సరికాదు.