దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంపై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి తన అసహనాన్ని వెళ్లగక్కారు. మూర్తి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తాను ఢిల్లీకి రావాలంటే అసౌకర్యానికి గురవుతున్నానని పేర్కొన్నారు. ఢిల్లీ నగరం క్రమశిక్షణారాహిత్యానికి మారు పేరుగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన అందుకు ఉదాహరణ అని అన్నారు. మంగళవారం ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్ నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ఆస్తులకంటే సమాజ ఆస్తులను మెరుగ్గా కాపాడుకోవాల్సి ఉందన్నారు.
నిజంగా చెప్పాలంటే నేను ఢిల్లీ రావాలంటే చాలా అసౌకర్యంగా భావిస్తున్నా. క్రమశిక్షణా రాహిత్యానికి ఢిల్లీ పరాకాష్టగా నిలిచింది. నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నా. ఒక చౌరస్తా వద్ద రెడ్ సిగ్నల్ పడింది. అక్కడ పలు కార్లు, మోటార్ బైక్లు, స్కూటర్లపై వెళుతున్న వారు ఉన్నారు. వారు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా రెడ్లైట్ ఉన్నా రోడ్మీద దూసుకెళ్తున్నారు` అని నారాయణ మూర్తి చెప్పారు. `ఒకవేళ మనం ముందుకు వెళ్లేందుకు ఒక నిమిషం, రెండు నిమిషాలు వేచి ఉండలేమా? ఒకవేళ అక్కడ మనీ ఉంటే వారు వేచి ఉంటారా? అవును వారు వేచి ఉండరు` అని పేర్కొన్నారు.
కార్పొరేట్ ప్రపంచంలో విలువల పరిరక్షణకు మారుపేరుగా నిలిచారు నారాయణమూర్తి. `ఇటువంటి చిన్న అంశాలపై మన పిల్లలకు నైతిక విలువలు బోధించాల్సి ఉంది. ఈ నైతిక విలువలను సరైన మార్గంలో అనుసరిస్తే అదే స్థాయిలో సత్ఫలితాలు వస్తాయి. ప్రలోభాలను నిరోధించే దిశగా పురోగతి సాధిస్తే నీకు భారీ లాభాలు వస్తాయి` అని చెప్పారు.
కార్పొరేట్ సుపరిపాలన గురించి తన టీచర్ నుంచే తొలి పాఠం నేర్చుకున్నానని నారాయణమూర్తి అన్నారు. `మీ వ్యక్తిగత ఆస్తుల కంటే సమాజ ఆస్తుల పరిరక్షణకు మెరుగైన చర్యలు తీసుకోవాలి. ఈ సూత్రాన్ని పాటించకపోవడం వల్లే ప్రభుత్వ సుపరిపాలనా వ్యవస్థలో నుంచి నిజాయితీలేని తనానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి` అని చెప్పారు.