‘కరోనా తర్వాత ధియేటర్స్ కి వెళ్లే అలవాటు తగ్గడంతో పాటు.. అప్పటికే మొబైల్, కంప్యూటర్స్ లో సినిమాలు చూసే సంస్కృతి క్రమంగా పెరిగింది. దీంతో ఓటీటీ బిజినెస్ బాగా పుంజుకుంది..’
అమెజాన్, నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్, జీ5, సోనీ లివ్, ఆహా వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) సేవల పరిశ్రమ వచ్చే ఏడాదిలో రూ.12,000 కోట్ల స్థాయికి చేరుకోనుందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేసింది. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి వీసీఆర్, వీసీపీ, వీసీడీలు ప్రాభవం కోల్పోయి క్రమంగా మల్టీప్లెక్స్లు జోరందుకున్నాయని.. ప్రస్తుతం మల్టీప్లెక్స్ల విషయంలోనూ అదే పునరావృతం కానుందని నివేదిక పేర్కొంది. మున్ముందు ఓటీటీలు మరింత జోరందుకోనున్నాయని.. 2018లో రూ.2,590 కోట్ల స్థాయిలో ఉన్న ఓటీటీ మార్కెట్ సైజు 2023 నాటికి రూ.11,944 కోట్లకు చేరుకోవచ్చని అంటోంది. అంటే, మార్కెట్ ఏటేటా 36 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో 45 కోట్లకు పైగా ఓటీటీ సబ్స్ర్కైబర్లు ఉన్నారని.. 2023 నాటికి 50 కోట్లకు చేరుకోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. చౌక మొబైల్ ఇంటర్నెట్ సేవలతో పాటు ఇంటర్నెట్ వినియోగదారులు రెట్టింపవడం, డిజిటల్ చెల్లింపు సేవల వినియోగం ఊపందుకోవడం, ఓటీటీల రాయితీలు ఇందుకు దోహదపడుతున్నాయని అన్నారు.