ఈ భూమండలంపై ఆధిపత్యం చెలాయిస్తున్న మనిషి మేధకు అతి త్వరలో పెను సవాల్ ఎదురుకాబోతోంది.. టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే (ఏఐ) మునుముందు మానవ మేధపై ఆధిపత్యం వహించే ప్రమాదం ఉన్నదని ఆ కృత్రిమ మేధను సృష్టించిన శాస్త్రవేత్త, గాడ్ఫాదర్ ఆఫ్ ఏఐగా ప్రసిద్ధి చెందిన జాఫ్రీ హింటన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
ఏఐ నుంచి భవిష్యత్తులో ఎదురుకానున్న ప్రమాదల గురించి మానవ జాతిని హెచ్చరించేందుకు వారం క్రితమే ఆయన గూగుల్లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2012లో టొరంటోలో తన ఇద్దరు శిష్యులతో కలిసి ఆయన ఏఐని సృష్టించారు. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకరు ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న ‘ఓపెన్ ఏఐ’ ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు. ఏఐ విషయంలో గూగుల్ సంస్థ ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నదని ప్రశంసించిన హింటన్, ఈ టెక్నాలజీ వల్ల తలెత్తబోయే దృష్ప్రభావాల గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకే తాను గూగుల్ నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు.
ఏఐ వల్ల ఎన్నో ప్రమాదాలు
ఏఐ త్వరలో అసాధారణంగా అభివృద్ధి చెందుతుందని, దానివల్ల ఎన్నో ప్రమాదాలు కూడా ఉంటాయని హింటన్ న్యూయార్క్టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రస్తుతానికి మనిషికంటే ఏఐ తెలివైందేమీ కాదు. కానీ త్వరలో ఆ స్థాయికి చేరుకొంటుందని భావిస్తున్నా. భవిష్యత్తులో ఏఐ కొట్లాది ఉద్యోగాలను లేకుండా చేస్తుంది. అది సృష్టించే మాయా ప్రపంచంలో నిజమేదో తెలుసుకోవటం కూడా చాలా కష్టం’ అని వివరించారు.