రియల్ ఎస్టేట్.. ముఖ్య0గా అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అమ్ముడుపోక కనస్ట్రక్షన్ కంపెనీలు సంక్షోభంలో పడ్డాయ్. ప్రధానంగా మెట్రో నగరాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ముంబై, కోల్కతా, చెన్నై, పుణే, ఢిల్లీ-ఈ 5 ప్రధాన నగరాలలో ఐదారేళ్లుగా నిర్మాణరంగ పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే హైదరాబాద్, బెంగళూరు నగరాలలో మాత్రం ఏడాది నుంచే స్తబ్దత నెలకొంది.
ఏపీలో మరింత స్తబ్దత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ గత రెండేళ్లుగా ఒడిదుడుకులలో కొట్టుమిట్టాడుతోంది. వెంచర్లలో పరిస్థితి తిరోగమనంలో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక నిర్మాణ రంగంలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, గుంటూరు తదితర నగరాలలో వేల కొద్దీ అపార్ట్మెంట్స్ లలో ప్లాట్స్ సేల్ కాక బిల్డర్స్ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ఏడు ప్రధాన నగరాలలో.,
దేశంలో 7 ప్రధాన నగరాలలో రెండేళ్లుగా 4.80 లక్షల ఇళ్ళు అమ్ముడుపోకుండా ఉండిపోయాయట. హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, పుణే, బెంగళూరు, ఢిల్లీ- ఈ ఏడు ప్రధాన నగరాల్లో 2014 అంతకంటే ముందు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకొని అనరాక్ఓ రేటింగ్ ఏజెన్సీ నివేదికనురూపొందించింది. పనులు నిలిచిన లేదా జాప్యమవుతున్న ఇళ్లలో 77 శాతం ఢిల్లీ- , ముంబై పరిధిలోనే ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణాదికి చెందిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇలా నిలిచిపోయిన వాటా 9 శాతమే. పుణేలోను 9 శాతం, కోల్కతాలో అయితే కేవలం 5 శాతమే నిలిచిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వ్యవసాయ భూములపై దృష్టి
రానున్న రోజులలో ఆహార సంక్షోభం వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తతో పలువురు వ్యవసాయ భూములు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే రియల్ ఎస్టేట్ మందగమనానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో రానున్న రోజులలో మరింత మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయ్. ఈ కారణంగా గత రెండేళ్లలో ఏపీ, తెలంగాణాలలో వ్యవసాయ భూముల ధరలు 20-40 శాతం పెరిగాయ్.