యోగా గురువు రామ్ దేవ్ బాబా ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఫుడ్స్ సంస్థ పబ్లిష్ ఇష్యూకి రెడీ అవుతోంది. పబ్లిక్ వాటాను సెబీ నిర్దేశిత 25 శాతానికి పెంచేదిశగా బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ సంస్థ పతంజలి ఫుడ్స్ రెండవ ఫాలో ఆన్ పబ్లిక్ఆఫర్ (ఎఫ్పీవో) జారీచేయడానికి సిద్ధమవుతున్నది. వంటనూనెల విభాగంలో పేరొందిన పతంజలి ఫుడ్స్లో పబ్లిక్కు ప్రస్తుతం 19.18 శాతం వాటాయే ఉంది. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతాన్ని మించకూడదు. ఇంతకు మించిన వాటాను కలిగి ఉన్నందున పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ల షేర్లను స్టాక్ ఎక్సేంజీలు ఫ్రీజ్ చేశాయి. బాబా రాందేవ్ మాట్లాడుతూ షేర్ల ఫ్రీజ్వల్ల పతంజలి ఫుడ్స్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. 2022 మార్చిలో కంపెనీ జారీచేసిన ఎఫ్పీవో కారణంగా కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్) 19.18 శాతానికి పెరగ్గా, ఎంపీఎస్కు 5.82 శాతం తరుగు ఏర్పడుతున్నది. తాము 6 శాతం షేర్లను ఎఫ్పీవోలో విక్రయించి, పబ్లిక్ వాటాను 25 శాతానికి చేరుస్తామని రాందేవ్ అన్నారు. లిస్టింగ్ తర్వాత ఒక ఏడాది వరకూ సెబీ మార్గదర్శకాల ప్రకారం ప్రమోటర్ల షేర్లు లాక్ఇన్లో ఉన్నాయని, ఈ గడువు 2023 ఏప్రిల్ 8తో ముగియనున్నందున, మరో ఎఫ్పీవో జారీ ప్రక్రియను ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామని వివరించారు. పతంజలి ఫుడ్స్ ప్రమోటర్లుగా పతంజలి ఆయుర్వేద సీఈవో ఆచార్య బాలకృష్ణతో పాటు పలు గ్రూప్ సంస్థలు కూడా ఉన్నాయి.