ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం కలిగించిన సీఎం జగనోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే నిందితుల స్టేట్ మెంట్స్ ను సీబీఐ అధికారులు కోర్టు ముందు ఉంచారు. దస్తగిరితో సహా.. వివేకాతో సంబంధాలు ఉన్న పలువురిని సీబీఐ విచారించి..వారి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. హత్య జరిగిన రోజున పులివెందులలోని వివేకా నివాసంలో చోటు చేసుకున్న పరిణామాలు…వివేకా మరణం పైన తొలుత గుండెపోటుగా జరిగిన ప్రచారం మొదలు..పలు కోణాల్లో పలువురి నుంచి సీబీఐ సమాచారం సేకరించింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో అనేక సంచలన అంశాలు వెలుగు లోకి వచ్చాయి.
హైకోర్టులో వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి..శివ శంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్ల పై హైకోర్టు విచారణ చేపట్టింది. నిందితుల తరపున వాదనలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక, సీబీఐతో పాటుగా ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసిన సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించనున్నారు. దీంతో..వివేకా కుమార్తె సునీత కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు.
శివశంకర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు మొదలైన సమయంలో తమ వాదనలూ వినాలని సునీత తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీని నిమిత్తం ఇంప్లీడ్ పిటీషన్ వేసిన విషయాన్ని కోర్టుకు నివేదించారు. ఇక, ఈ హత్య సంఘటన పై ఇప్పటికీ ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.