ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాతావరణశాఖ, అప్రమత్తం చేస్తోంది. మొన్నటి వరకు వర్షాలతో ఉపశమనం పొందిన జనాలు.. ఇప్పుడు ఎండలు, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం 45 డిగ్రీల వరకు చేరాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వడగాలుల తీవ్రత కూడా పెరగడంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. సోమ, మంగళవారాలలో కూడా ఉష్టోగ్రతలు హెచ్చుగా ఉండటంతోపాటు, వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇవాళ 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ. సోమవారం కూడా పలు జిల్లాల్లో 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8°C ల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో 44.7.. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని, రావిపాడుల్లో 44.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అలాగే పలు జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.