- పోలీసులకు పట్టుబడ్డ యువకులు
- కలకలం రేపుతున్న మత్తుపదార్థాలు
విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. గతంలో కూడా మాదక ద్రవ్యాలతో కొందరి యువకులను పట్టుకున్నారు. ప్రశాంతతకు నిలయమయిన విశాఖపై డ్రగ్స్ నీలనీడలు అలముకుంటున్నాయి. చాపకింద నీరులా నగరానికి డ్రగ్స్ రవాణా సాగిపోతోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చీకటి వ్యవహారాన్ని చాకచక్యంగా సాగిస్తున్నారు. వారంతా విద్యార్థులే కావడం మరింత బాధాకరం. తాజాగా ఈ రోజు విశాఖలో డ్రగ్స్ కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ సీపీ శ్రీకాంత్ మీడియాకు వివరాలు తెలిపారు. రవికుమార్, వాసు దేవా కాటయ్య, మోజేష్, యాడ కిషోర్, మర్రే సందీప్ అనే యువకులు గోవా నుంచి విశాఖకు డ్రగ్స్ ను తీసుకొచ్చారు. నిందితుల నుంచి 50 ఎల్ ఎస్ డి బ్లాట్స్..4.4 గ్రాముల ఎండీఎంఎ పౌడర్ ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే నిందితులు ఉపయోగించిన 5 సెల్ పోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.
ఇందులో మరో నిందితుడు దిలీప్ కూడా ఉన్నాడని అతడిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. గత హోళి పండుగ సమయంలో రవికుమార్ డ్రగ్స్ తీసుకొచ్చాడు, ఇవాళ ప్రెండ్ షిప్ డే కావడంతో మళ్లీ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ శ్రీకాంత్ వివరించారు. గతంలో యాంటినార్కోటిక్ సెల్ ద్వారా హైద్రాబాద్ లో గచ్చిబౌలి త్రీబుల్ ఐటీలో చదువుతున్న నలుగురు విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ అమ్ముతున్న, అలవాటు ఉన్న వారిపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. వారంతా డ్రగ్స్ కోసం డార్క్ నెట్ ను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయమై తమ దర్యాప్తులో గుర్తించామన్నారు. అయితే మరో నిందితుడు దిలీప్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. డార్క్ వెబ్ లో క్రిఫ్టో కరెన్సీని ఉపయోగించి ఈ డ్రగ్స్ కొనుగోలు చేశారు. రిటైల్ గా మాత్రం యూపీఐ ద్వారా డ్రగ్స్ ను విక్రయిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ కోసం ఆర్డర్స్ తీసుకుంటున్నట్టుగా తాము గుర్తించామని పోలీసులు వివరించారు.
డ్రగ్స్ కొనుగోలు కోసం పటిష్టమయిన కొరియర్ వ్యవస్థ పనిచేస్తుందని, విద్యార్ధులనే లక్ష్యంగా చేసుకొని ఈ మత్తుపదార్థాల సరఫరా సాగుతున్నట్టు సీపీ తెలిపారు. తొలుత గంజాయిని అలవాటుకు పడిన వారు మత్తు సరిపోకపోవడంతో యువత సింథటిక్ డ్రగ్స్ వైపునకు వెడుతోందన్నారు. రవికుమార్ గంజాయిని తీసుకెళ్లి గోవాలో ఉన్న దిలీప్ కు ఇచ్చేవాడని దానికి బదులుగా రవికుమార్ దిలీప్ కు డ్రగ్స్ ఇచ్చేవాడని ఆయన సీపీ వివరించారు. గత ఏప్రిల్లో కూడా ఎండీఎంఏను స్పటిక రూపంలో సరఫరా చేస్తున్న ముగ్గురిని విశాఖలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 54 గ్రామల డ్రగ్స్ ను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి నిందితులు ఈ డ్రగ్స్ ను తీసుకొచ్చారని పోలీసులు గుర్తించారు. విశాఖపట్టణంలో ఇటీవల కాలంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిఘా పెంచామని పోలీసులు చెబుతున్నా డ్రగ్స్ కలకలం రేగుతూనే ఉంది.