కొన్నాళ్లుగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై మౌనం పాటిస్తూ టీడీపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తూ వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ రాజకీయాల్లో మళ్ళీ చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును గెలిపించేందుకు నడుం బిగించారు. ఇటీవల ఆయనకు మద్దతుగా పలు సభల్లోనూ పాల్గొనడం ద్వారా తాను టీడీపీలో కొనసాగబోతున్నట్టు గంటా మరోసారి సంకేతాలు పంపారు. ఇక ఎన్నికలు 13వ తేదీ సోమవారం జరగనున్న నేపథ్యంలో టీడీపీ బలపరచిన అభ్యర్థికి ఓటు వేసి పట్టభద్రులంతా గెలిపించాలని, రాష్ట్రం ప్రస్తుతం ఉన్న దుస్థితిని గుర్తించాలని కోరుతూ శనివారం కీలక ప్రకటన చేశారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో టీడీపీ ఎమ్మెల్యే దీనిని పోస్ట్ చేశారు.
అక్షర క్రమంలోనే కాదు.. అంతరిక్ష పరిశోధన వరకూ అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత దుస్థితికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది. అధికార పార్టీ ప్రలోభాలు, ఇచ్చే సొమ్ములకు లొంగే సంస్కృతి మనది కానప్పటికీ అందరం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 2024లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలకు బీజం వేసే ఈ క్రతువులో వివేకవంతులైన పట్టభద్రులు చారిత్రక నిర్ణయం తీసుకుంటారని బలంగా నమ్ముతున్నాను,. టీడీపీ బలపరచిన విద్యాధికుడైన ప్రొఫెసర్ చిరంజీవిరావుకు తొలి ప్రాధాన్య ఓటువేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అన్నివర్గాల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించగల నేతకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అంటూ ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రానికి పునర్వైభవం టీడీపీతోనే సాధ్యం అంటూ ఆయన ప్రకటించారు. దీంతో అటు జనసేనలోకి గానీ లేదా బీజేపీలోకి ఆయన చేరే అవకాశం ఉన్నట్టు కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఆయన తాత్కాలికంగానైనా చెక్ పెట్టినట్టయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.