ఎలమంచిలి..
పెద్దపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్దపులి సంచరిస్తుందన్నవార్త స్థానికుల్లో ఆందోళన రేపుతోంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. సుమారు 6500 ఎకరాల విస్తీర్ణంలో పెద్దపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. పెద్దపులి పెద్దపల్లి అటవీ రేంజ్ పరిధిలో ప్రవేశించిందని నర్సీపట్నం రేంజ్ అధికారి రాజబాబు చెప్పడంతో ఎలమంచిలి అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ ఆనవాళ్లు లేకపోయినా పులి సంచరిస్తుందంటూ ఆ నోటా ఈ నోటా.. ప్రచారం జోరు సాగుతోంది. దీంతో మరింత ఆందోళన మొదలైంది. అంతేకాకుండా చోడవరం అటవీ శాఖ రేంజర్ ఎలమంచిలి ఇంచార్జ్ రామ్ నరేష్ నేతృత్వంలో పెద్దపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యటించారు.
ముఖ్యంగా పులి జాడలను పసికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అడవి పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి కనిపిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. పులిపై దాడి చేయడం.. గాయపరచడం.. చంపేందుకు ప్రయత్నించడం చేయవద్దని కోరారు. అలా చేసినట్లయితే జంతు సంరక్షణ చట్టం కింద శిక్షార్హులవుతారని హెచ్చరించారు. పెద్దపులి సంచారజాడలు తెలియకపోవడంతో పరిసర ప్రాంత ప్రజలలో ఆందోళన తీవ్రమవుతోంది. అటవీశాఖ అధికారులు స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా పెద్దపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రవేశించిన పులి జాడ ఇంతవరకు తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.