అల్లూరి సీతారామరాజు జిల్లా.. చింతపల్లి
రెండు వారాలుగా మన్య ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తాజంగి జలాశయానికి జలకళ వచ్చింది. ఆంధ్ర కశ్మీర్ గా పర్యాటక ప్రాంతంగా పేరొందిన లంబసింగి, తాజంగి ప్రాంతాలలోని తాజంగి జలాశయాన్ని పర్యాటకులు నిత్యం సందర్శిస్తుంటారు. ఈ జలాశయం పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు పాడేరు ఐటీడీఏ అధికారులు బోటు షికార్ లు కూడా ఏర్పాటుచేశారు. ఈ జలాశయం దిగువన వేలాది ఎకరాల పంట పొలాలున్నాయి. జలాశయానికి రెండు వైపులా ఉన్న కుడి, ఎడమ కాల్వలు శిథిలావస్థకు చేరడంతో ఈ ఏడాదిలోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరమ్మతు పనులు చేపట్టి సాగునీరు వృథా కాకుండా చర్యలు చేపట్టారు. ఈ మధ్యకాలంలో నైరుతీ రుతుపవనాలు, అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జలాశయం నిండి జలకళను సంతరించుకుంది. దీంతో పర్యాటకులు, రైతులుకూడా చాలా ఆనందిస్తున్నారు.