ఏపీ సీఎం జగన్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. జీఓ నెం .1పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ముంగించింది. జీవో 1 పై ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచుడ్, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం నేడు విచారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేపడుతుందని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
నోటీసు కూడా ఇవ్వకుండా… ఉదయం ప్రస్తావిస్తే… మధ్యాహ్నం విచారణ చేపట్టి స్టే ఇవ్వడంపై అభ్యంతరాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీనికి ప్రతివాదుల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇరువురి వాదనల అనంతరం… పిటిషన్పై విచారణను సీజేఐ ధర్మాసనం ముగించింది. ఈ పిటిషన్కు సంబంధించిన మెరిట్స్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేస్తూ… రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తదుపరి విచారణ చేపడుతుందని సీజేఐ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణ చేపడుతుందని ఉత్తర్వుల్లో సీజేఐ పేర్కొన్నారు.
ఈ నెల 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టాలని సీజేఐ సూచించారు. వాద ప్రతివాదులు ఇరువురూ… అన్ని అంశాలను డివిజన్ బెంచ్ ముందు ప్రస్తావించుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్ని అంశాలు ఓపెన్గా ఉంచుతున్నామని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. కేసు మెరిట్స్పై ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టడం లేదని సీజేఐ పేర్కొంది.