ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆ ప్రాంత రైతులు మరో మారు పాదయాత్రకు ప్లాన్చే చేస్తున్నారు. మొదటి దశ పాదయాత్రను విజయవంతంగా పూర్తీ చేసిన రైతాంగం..ఇపుడు రెండో దశ పాదయత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి రెండో దశ పాదయాత్రను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు రైతు జేఏసీ నేతలు చెప్తున్నారు. అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ గుంటూరులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర వెంకటపాలెంలో ముగిసింది. గుంటూరు నుంచి తుళ్లూరు, రాయపూడి, వెంకటపాలెం మీదుగా టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు సైకిల్ యాత్ర కొనసాగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సైకిల్ యాత్ర చేసిన వారికి స్థానిక రైతులు ఘనంగా స్వాగతం పలికారు. రైతులు చేపట్టే మహాపాదయాత్రకు అండగా ఉంటామని సైకిల్ యాత్రలో పాల్గొన్నవారు భరోసా ఇచ్చారు. రాజధానిని నిర్లక్ష్యం చేయడం భావితరాలకు మంచిది కాదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. తొలి విడత పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. దీంతో రెండో విడత మరింత పకడ్బందీగా చేయాలనీ సంకల్పించారు.