తమిళ్ హీరో ఆర్.మాధవన్ స్వీయ రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాపై సీబీఐ అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఈ జులై 1న విడుదల కానుంది. ఈ సినిమాకి మాధవన్ దర్శకత్వం వహించడం విశేషం. ఇదొక ట్రూ స్టోరీని ఆధారంగా తీసుకుని తీసిన సినిమా. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఆయన పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. తర్వాత అది నిజం కాదని తేలింది. దీంతో నిర్దోషిగా బయటకు వచ్చారు.
మాధవన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీకి శ్యామ్ సీయస్ సంగీతం అందించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాంది. అయితే మాధవన్ తో సిమ్రన్ జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, సౌత్ యాక్షన్ స్టార్ సూర్య కూడా ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. అంతే కాదు ఆరు భాషల్లో ఈ సినిమా రానుంది.
అయితే ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీని ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో సీబీఐ మాజీ అధికారుల కోసం ప్రదర్శించారు. ఆ సంస్థ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సహా పలువురు సీబీఐ అధికారులు, సినీ ప్రముఖులు సినిమా చూశారు. సినిమా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా ఉందని ప్రశంసల జల్లు కురిపించారు. సైన్స్, టెక్నాలజీ, ఎమోషన్ మేళవింపుతో అద్భుతంగా ఉందని సీబీఐ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ పి.ఎం.నాయర్ ప్రశంసించారు. నంబి నారాయణన్లా ఇస్రో అభివృద్ధి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వేలాదిమంది శాస్త్రవేత్తలకు ఈ సినిమా అంకితమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖల కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు.