అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పేరు, ఇతర మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబాల విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.
అయితే ఈ రేషన్కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12వేలు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్కార్డు కోల్పోయారు. ప్రభుత్వ పథకాలకు తామంతా దూరమయ్యామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పరిమితిని పెంచి వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వం వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. వాహనాల ద్వారా రేషన్ పంపిణీపైనా నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న ఆరువేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా 4వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.