‘సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ భరోసా లభించింది.. అయితే 2019 ఎన్నికలలో గెలుపొందిన వారికి సీటు గ్యారంటీ ఉన్నా.. స్థానం మారవచ్చు. ఈ విషయాన్నే ఆ పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. .’
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. కోనసీమలో.. రాజోలు, అమలాపురం అసెంబ్లీ స్థానాలలో స్థానిక నాయకులను ఇబ్బంది పెడుతున్నారని రాజప్పపై వచ్చిన ఫిర్యాదులపైనా ప్రస్తావనకు వచ్చినట్లు చెప్తున్నారు.
రాజప్పకు ఎంపీ బెటర్:
. జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరున్న రాజప్పకు కాపు సామాజిక వర్గంలో విస్తృత పరిచయాలు, పలుకుబడి ఉన్నాయి. కాకినాడ లోక్ సభ కూడా ఆ సామాజిక వర్గానికే కేటాయిస్తుంది టీడీపీ. 2024 ఎన్నికల్లో రాజప్పను లోక్ సభ నుంచి పోటీకి దింపితే ఎలా ఉంటుందనే దానిపై కొంత కాలంగా పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే అంశం చంద్రబాబు-రాజప్ప భేటీ లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ‘పెద్దాపురంలో నాకు బాగా పాజిటివ్గా ఉంది. మళ్ళీ అక్కడే సీటు ఇవ్వండి. మళ్ళీ గెలుస్తా..’ అని రాజప్ప చంద్రబాబుతో చెప్పినట్లు రాజప్ప కేడర్ లో ప్రచారం జరుగుతోంది. అయితే.. ‘నీ లాంటి సీనియర్ నాయకుడు లోక్ సభకు వెళ్లడం బాగుటుంది. లోక్ సభ పరిధిలో ఉన్న నేతలందరిలో నువ్వయితే సూటబుల్ గా కనిపిస్తున్నావు. అసెంబ్లీ ఇంచార్జ్ లు కూడా నువ్వు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.. ఏమంటావ్? రాజప్పా?” అని చంద్రబాబు రాజప్ప ఒపీనియన్ అడిగారట. ఇదే అంశంపై జిల్లా టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ నడుస్తోంది. అయితే చంద్రబాబు ప్రస్తావనపై రాజప్ప ఇష్టత చూపలేదని చెపుతున్నారు. ‘నేను ఎక్కడ పోటీ చేస్తానంటే అక్కడ సీటిస్తారు. అదీ టీడీపీలో, చంద్రబాబు దగ్గర నాకున్న పట్టు..’ అని రాజప్ప బాహాటంగానే చెప్తూ.. ఎట్టిపరిస్థితులలో పెద్దాపురం అసెంబ్లీ నుంచే పోటీ చేస్తా..’ అని ఘంటా పధంగా చెప్తున్నారు రాజప్ప. అయితే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.