వైసీపీ రెబల్ ఎంపీగా ( నరసాపురం) ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జగన్ సర్కార్ ఇప్పటికే పలు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసినవి కొన్నయితే, అధికారులు, ఇతరులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైనవి కొన్ని., అయితే వీటి వివరాలు మాత్రం అందుబాటులో లేకుండా రహస్యంగా ఉంచారు. దీంతో వీటిలో ఏదో ఒక కేసును సాకుగా చూపి ఆయన్ను అరెస్టు చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఎంపీ రఘురామ సొంత పార్టీతో విభేదించడం మొదలుపెట్టాక రాష్ట్రంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇందులో తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆయన రాష్ట్రం వెలుపల ఉంటున్నారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో ఉంటూనే వైసీపీ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఈ కేసుల వ్యవహారంలో తాడోపేడో తేల్చుకోవాలని భావించడంతో వీటి వివరాలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. రఘురామపై దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హోంశాఖ తాజాగా హైకోర్టుకు వివరాలిచ్చింది.
రఘురామపై ఏపీలో మొత్తం 11 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు హోంశాఖ హైకోర్టుకు తాజాగా వెల్లడించింది. గతంలో రఘురామ చేసిన విజ్ఞప్తి మేరకు వివరాలు అందించాలని ఆదేశించిన హైకోర్టు.. తాజాగా మరోసారి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేసుల సంఖ్యను మాత్రమే వెల్లడించింది. వివరాలు అందించేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును . ఈ విషయంలో ఆయనకు హైకోర్టు కీలక సూచన చేసింది. ఫిర్యాదుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని తీసుకోవాలని సూచించింది. దీంతో ఆయన ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీటిని ప్రభుత్వం ఇస్తుందా లేదా ఎదో సాకు చూపి జాప్యం చేసే అవకాశం కూడా ఉంది.