వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారం కైవసం చేసుకుంటామని చెపుతూ వచ్చిన బీజేపీ- జనసేన పార్టీల మధ్య అంతకంతకూ దూరంపెరుగుతున్న సంకేతాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. తాజాగా భీమవరం పర్యటనలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా దీనినే సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే బీజేపీతో పొత్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన పాల్గొనకపోవడంపై పలు రకాల కథనాలు వెలువడ్డాయి.
ఇదే అంశంపై భీమవరంలో స్పందించిన పవన్ కల్యాణ్ తనకు ప్రధాని సభకు ఆహ్వానం ఉందని, అయితే స్థానిక ఎంపీ రఘురామరాజుకు ఆహ్వానం లేదని, అది అప్రజాస్వామికంగా భావించి తాను కూడా ఆ సభకు దూరంగా ఉన్నట్టు వెల్లడించారు. నిజానికి అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. దేశం బానిస సంకెళ్లు తెంచుకుని 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరిగిఉంటే మరింత బాగుండేది. ఈ సభలో విపక్ష నేతలకు తగిన గౌరవం లభించకపోవడం, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలా మారిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
ఇప్పుడు పవన్ ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా విమర్శించడంతో పాటు, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పరోక్షంగా తప్పు బట్టినట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే సాక్షాత్తూ ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో స్థానికంగా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు పాల్గొనలేని పరిస్థితి ఉండటం కేంద్రం ప్రభుత్వ ప్రతిష్ఠకు మేలు చేయదు. ఇదే అంశాన్ని జనసేనాని ఎత్తిచూపినట్టు కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటికీ పొత్తులోనే ఉన్నామని చెపుతున్నప్పటికీ బీజేపీ- జనసేన కలిసి ఎలాంటి కార్యక్రమాలనూ చేపట్టడం లేదు. ఎవరిదారి వారిదన్న రీతిలోనే వెళుతున్నారు. ఇక రోడ్ మ్యాప్ మొదలుకుని, కూటమి సీఎం అభ్యర్థిగా పవన్కల్యాణ్ను ప్రకటించాలనే అంశం వరకూ బీజేపీ ఏమంత సానుకూలంగా స్పందించలేదని ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య పెరుగుతున్న అంతరాన్నిసూచిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రెస్మీట్లో జనసేనాని మాట్లాడుతూ రఘురామరాజుకు జరిగిన అవమానం ఆయనొక్కడికే జరిగింది కాదని మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి జరిగినట్టుగా తాను భావిస్తున్నానని తెలిపారు. తద్వారా ఆ ప్రాంతంలో ఆధిపత్యం వహిస్తున్న ఆ వర్గం సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. అంతేకాదు.. ప్రజల్లో రాష్ట్ర భావం ఎలాగూ లేదు.. కనీసం కుల భావనతోనైనా పని చేయాలని, ఓట్ల కోసం కులం కావాలి.. గెలిచిన తర్వాత కులం అవసరం లేదనే స్వార్థపరులను దూరంగా పెట్టాలంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.