రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో వెనుకబడిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. అప్పులు తెచ్చి పాలన సాగిస్తామంటే రాష్ట్రం ఆర్థికంగా ఎలా నిలబడగలదని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు దీర్ఘకాలంలో ప్రజలను బలహీన పరచేలా ఉండకూడదన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఏపీలో ఐటీ పరిశ్రమను భారీ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పవన్కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక ఐటీ రంగం హైదరాబాద్, బెంగళూరుల్లో మరింత విస్తరించిందని ఏపీలో అభివృద్ది లేకపోవడంతో యువత పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారని ఆయన అన్నారు.
ఇటీవల రాయలసీమలో పర్యటించిన సమయంలో అక్కడి యువత ఇదే అంశంపై మన రాష్ట్రంలో ఐటీ ఎందుకు అభివృద్ధి చేయరని తనను అడిగారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా తాను మాట ఇస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిస్తే ఏపీలో ఐటీ రంగాన్ని ఇతర రాష్ట్రాలకంటే మెరుగైన స్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వాగ్దానాలతో ప్రలోభపెట్టడం తాను చేయనని, దావోస్ వెళ్లి ఫొటోలు దిగివచ్చినంత మాత్రాన పెట్టుబడులు రావన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ప్రకటించగలరా..? అంటూ జనసేన అధినేత సవాల్ విసిరారు. పదవి మనని వెతుక్కుంటూ రావాలని..దాని వెంట మనం పడటం సరికాదని పవన్ అన్నారు. స్థాయి, సమర్థత ఉందని ప్రజలు విశ్వసిస్తే వారే అవకాశం ఇస్తారని వ్యాఖ్యానించారు.