మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతారని.. గతంలో రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి.. కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని ఆయన తెలిపారు. అది ఆలస్యమవ్వడానికి కొవిడ్ కారణమని చెప్పారు. అంతే కాదు ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని మంత్రి వెల్లడించారు. అదేమిటంటే ముఖ్యమంత్రి జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి తన పాలన ప్రారంభించవచ్చన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్నది సీఎం జగన్ సంకల్పం. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే చంద్రబాబు దానిని అడ్డుకునేందుకు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఈ యాత్ర ఉత్తరాంధ్ర ప్రజలపై చేస్తున్న దండయాత్ర.. అమరావతిలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు సీఎం జగన్ గురించి చులకనగా, అవహేళనగా మాట్లాడటం సరికాదని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు చేసిన వ్యాఖ్యలు వింటే వారు కూడా విశాఖ ప్రాంత వ్యతిరేకులుగా భావించాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని, అమరావతిలోని 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదన్న భావనతోనే ఈ సభను ఏర్పాటు చేసినట్లు అర్థం అవుతోందని దుయ్యబట్టారు.
అమరావతి వద్దు అని చెప్పలేదని అమరావతిని కూడా కలుపుకొని 3 రాజధానులు చేసి చూపిస్తామని అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై అమర్నాథ్ స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాతే ఈ విషయం గురించి మాట్లాడాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు అమరావతి టూ అరసవెల్లి యాత్ర పేరుతో రెచ్చగొడుతున్నారన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజధాని కడతామని ప్రభుత్వం చెబుతుంటే.. వద్దంటూ యాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. రైతులు చేస్తున్న పాదయాత్రను వెనకబడిన ఉత్తరాంధ్రపై దౌర్జన్య యాత్రగా పేర్కొన్నారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని పాదయాత్ర పేరిట ప్రజలను రెచ్చగొచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.