”ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ ప్రశ్నించకూడదు .. ప్రశ్నించిన వారిపై హింస, దాడులకు పాల్పడుతున్నారు .” అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు తెలిపారు. గన్నవరం విధ్వంసంపై ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్ మోహన్రె డ్డి వ్యవహారంపైన, వ్యవస్థల దుర్వినియోగంపైనా ఆయన లేఖ రాశారు. గన్నవరం ఘటనలో బాధితులనే నిందితులుగా చేయడం దారుణమని ఈ లేఖలో పేర్కొన్నారు. జగన్ రాజకీయ కక్షసాధింపునకు పోలీసులు పావుల్లా మారుతున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు, పోలీస్ టార్చర్ అన్నట్లుగా సర్కార్ తీరు ఉందని తప్పుబట్టారు. గన్నవరం విధ్వంసం, పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. బాధితులైన టీడీపీ వారినే నిందితులుగా మార్చి.. జైలుకు పంపిన వైనంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని చంద్రబాబు కోరారు. జగ్గంపేట, పెద్దాపురం లో టీడీపీకి ప్రజాస్పందన చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. టీడీపీకి ప్రజాదరణ చూసి ప్రభుత్వానికి భయంపట్టుకుందని తెలిపారు. అనపర్తి సభతో ఉలిక్కిపడిన జగన్.. గన్నవరంలో కొత్త కుట్రకు తెరలేపారని చంద్రబాబు ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో మండిపడ్డారు.
కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. గన్నవరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసానికి తెగబడ్డారు. పక్కా వ్యూహంతో టీడీపీ బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. నాయకుల కార్లను తగులబెట్టారు. ఈ మొత్తం అరాచకమంతా టీడీపీ టికెట్పై గెలిచి.. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలోనే సాగడం గమనార్హం. కళ్ల ఎదుటే వైసీపీ మూకలు ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు కళ్లప్పగించి చూశారు తప్ప అడ్డుకోకపోవడం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.