బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం టీడీపీ (TDP)లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కండువా కప్పి కన్నాను పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అంతకుముందు కన్నా లక్ష్మినారాయణ గుంటూరులోని తన నివాసం నుంచి 3 వేల మంది కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చారు.
” స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు సిద్ధాంత పరంగా వెళ్లడంలేదు. కొందరు కీలక నేతలు వాళ్ల వ్యక్తిగతంగా చూసుకుంటున్నారు .. పార్టీ ఎదుగుదల గురించి వాళ్ళకి అక్కర్లేదు. ” అని కన్నా అభిప్రాయపడ్డారు. స్థానిక నేతలతో పడకనే బీజేపీ నుంచి బయటకు వచ్చానని ఈ సందర్బంగా కన్నా చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర నుంచి బీజేపీ అధిష్టానం దృష్టికి కొన్ని విషయాలను తీసుకెళ్తున్నానని.. వాటిని పట్టించుకోలేదని అన్నారు. అందువల్లనే బీజేపీ నుంచి బయటకు వచ్చానని కన్నా స్పష్టం చేశారు.
ఢిల్లీ వెళ్లిన ఫిర్యాదులు: కుదిరితే బీజేపీ నాయకత్వం మార్చండి… లేదంటే పార్టీ అనుసరిస్తున్న విధానాలు అయినా మార్చండి అంటూ తాజాగా ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు ఏపీ బీజేపీ అసమ్మతి నేతలు..పార్టీ ఇంఛార్జ్ మురళీధరన్ ఈ మేరకు హామీ ఇచ్చారని పలు జిల్లాల నుంచి వెళ్లిన నేతలు తెలిపారు.