- మహారాష్ట్రకు కిడ్నాప్
- 6 నెలలుగా బందీలుగా..
- చెరలో చిక్కుకుపోయిన ఆరుగురు
అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ కథలు అన్నీ ఇన్నీ కాదు. వందల మంది ఆ వలలో చిక్కుకుంటారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటారు. జైళ్లపాలవుతారు. కొందరు హత్యలకు గురవుతారు. కాని మళ్లీ అదే పనిలో కంటిన్యూ అవుతారు. కారణం ఒకటి డబ్బు. రెండు పరిస్థితులు. అలాగే ఒక మాఫియా డాన్ చెరలో చిక్కుకున్నారు విశాఖ ఏజెన్సీకి చెందిన ఆరుగురు గిరిజనులు. ఆరునెలలుగా చిత్రవధ అనుభవించారు. చివరికి బయటపడ్డారు. మాఫియా డాన్ సుభాష్ అన్నా పవర్ అంతర్జాతీయ గంజాయి స్మగ్లర్. గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ ఏబులం కుమ్మరవీధి గ్రామానికి చెందిన పాంగి గోవర్దన్ గంజాయి రవాణ చేసేవాడు. 2020లో కోటనందూరు పోలీసులకు దొరికిపోయాడు. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా మూడు నెలలు ఉన్నాడు.
జైల్లో ఉన్న సమయంలో మహారాష్ట్ర ఉస్మానాబంద్ జిల్లా వాంగ్ గ్రామనాకకు చెందిన గంజాయి స్మగ్లర్ సుభాష్ అన్నా నవర్తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన గోవర్దన్ స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత సుభాష్ అన్నా పవర్ జైల్ నుంచి విడుదలై 2001 డిసెంబరులో ఏబులం గ్రామానికి వచ్చి గొల్లోరి హరిబాబు సహాయంతో కుమ్మరవీధిలో నివాసముంటున్న గోవర్దన్ ని పరిచయం చేసుకున్నాడు. తనకు గంజాయి కావాలని చెప్పి రూ.8లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. దీంతో నెల రోజుల్లో గోవర్దన్, హరిబాబు కలిసి 1700 కిలోల గంజాయిని వ్యాన్ లో మహారాష్ట్రకు తరలిస్తూ కర్ణంగిపూడి చెక్ పోస్టులో దొరికేశారు. హరిబాబు పోలీసులకు పట్టుబడగా, గోవర్దన్ తప్పించుకొని తన గ్రామానికి చేరుకున్నాడు. అయితే స్మగ్లర్ సుభాష్ అన్నా వవర్ తన గంజాయి కోసం ఏబులం కుమ్మరవీధికి వచ్చి గోవర్దన్ ని బలవంతంగా మహారాష్ట్ర తీసుకు వెళ్లాడు.
గోవర్దన్ ను 2021 డిసెంబరు నెలాఖరు నుంచి స్మగ్లర్ సుబాష్ అన్నా పవర్ గృహంలో బందీగా ఉంచాడు. అయితే ఆరు నెలలుగా పాంగి గోవర్దన్ స్మగ్లర్ చెరలో ఉన్నాడని తెలిసి అతడిని కాపాడాలని అభ్యర్ధించేందుకు గోవర్దన్ భార్య తన పిల్లలు, కుటుంబ సభ్యులతో మహారాష్ట్రకు వెళ్లింది. సుభాష్ అన్నా పవర్ వద్దకు వెళ్లిన గోవర్దన్ భార్య, ఇద్దరు కుమారులు, అతడి వదినను కూడా బంధించాడు. రూ.20లక్షల విలువైన గంజాయి తీసుకొచ్చి వాళ్లని విడిపించుకోవాలని గోవర్దన్ తమ్ముడు కేశవరావుకు చెప్పాడు. స్వగ్రామానికి చేరుకున్న కేశవరావు గంజాయి పంపించి కుటుంబ సభ్యులను విడిపించుకునే పరిస్థితిలేక పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 27న మహారాష్ట్ర పోలీసు సహకారంతో గంజాయి మాఫియా డాన్ సుభాష్ అన్న పవర్ గృహంలో దాడులు నిర్వహించారు. బందీలుగా ఉన్న గిరిజనులను విడుదల చేసి సుభాష్ అన్న పవర్ ను అరెస్ట్ చేశారు. సుబాష్ అన్నా పవర్ చింతపల్లి మండలం లోతుగెడ్డ వంచాయతీ చోడిరాయి గ్రామానికి చెందిన గిరిజనుడు గెమ్మెలి నాగేంద్రబాబుని కూడా బందించాడని పోలీసులు తెలిపారు. నాగేంద్రబాబు సోదరుడు చిట్టిబాబు రూ.ఏడు లక్షలు తీసుకొని గంజాయి తీసుకొనిరాలేదని అతడిని రెండేళ్లగా మాఫియా డాన్ బంధించాడని అతడిని కూడా విడుదల చేశామని చెప్పారు. సుభాష్ అన్నా పవర్ ని రిమాండ్ కు తరలించారు.