మన రాష్ట్రంలో చాలా కులాలు, తెగలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో వివిధ రకాల తెగలు జీవనం సాగిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో ఆదివాసీల గ్రామాలు వందల్లో ఉన్నాయి. వారి ఆచారాలు, సంప్రదాయాలు చాలా డిఫరెంట్. కొన్ని సంప్రదాయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. వాళ్ల కట్టుబాట్లు కూడా చాలా కఠినం. అలాంటిదే ఒక తెగ మాలి. ఈ తెగలో చిన్నారులకు మూడు సార్లు పెళ్లిళ్లు చేస్తారు. చేయవల్సిందే. అలా చేయకపోతే వారిలో అది చాలా పెద్ద నేరం. అలాంటి కుటుంబాలకు తీవ్రమైన శిక్షలు విధిస్తారు. తెగ నుంచి వెలివేస్తారు కూడా. చాలా ఆశ్చర్యంగా ఉన్నా.. విశాఖ, ఒడిశా సరిహద్దుప్రాంతంలో ఉండే మాలి తెగలో ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం.
మాలి తెగ ఆదివాసీలు విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, ముంచంగిపుట్టు మండలం దొడిపుట్, పనస, గత్తర ముండా, కుమార్పుట్టు, వనబసింగి, పెటమలిపుట్టు, అరకువేలి, డుంబ్రిగూడ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఈ మాలి తెగ ఒడిశా నుంచి వలస వచ్చినట్టు చెపుతారు. వారి జనాభా దాదాపు 8 వేలు అనేది అంచనా.. వారి చిన్నారులకు 3 సార్లు పెళ్లిళ్లు చేస్తారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్రామాల్లోని చిన్నారులందరికీ సామూహికంగా పెళ్లిళ్లు చేస్తారు.
ముఖ్యంగా ఈ తెగ వృత్తి కూరగాయలు పండించడం. దాదాపు వాళ్ల ఆచారాలు మిగతా తెగలకంటే భిన్నంగా ఉంటాయి. సాధారణంగా అన్ని తెగలకు వారివారి ఆచారాలు చాలా ప్రత్యేకమయినవే. కాని మాలి తెగలో పిల్లలు మూడు పెళ్లిళ్ల చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిన్నారులకు (ఆడపిల్లలకు) మాత్రమే ఈ పెళ్లి ఆచారం. అయితే వరుడు సంగతేంటి అనుకుంటున్నారా? వరుడనే వాడే ఉండడు. మొదటి రెండు పెళ్లిళ్లి అది ఒక ఆచారం. మూడోసారి జరిగిన పెళ్లికే వరుడు ఉంటాడు. మొదట ఆడపిల్ల పుట్టాక పెళ్లి చేస్తారు. తర్వాత 5 ఏళ్ల వయసు వచ్చాక మళ్లీ పెళ్లి చేస్తారు. ఇక మూడో పెళ్లి యుక్త వయసు వచ్చాక. మొదటి రెండు పెళ్లిళ్లలో వరుడి ప్రసక్తి ఉండదు. ఒక చిన్నారులకు మాత్రమే ఈ తంతు నిర్వహిస్తారు. కాని ఊళ్లో ఉన్నవారంతా ఈ పెళ్లిళ్ళను తమ పిల్లలు సామూహికంగా జరుపుకుంటారు.
చిన్నపిల్లల పెళ్లేకదా అని తేలిగ్గా తీసుకోకండి. ఊరంతా పండుగ వాతావరణం నిండుతుంది. ఆ తెగలోని పురోహితులు వారి పూజా విధానాలను అనుసరించి అద్భుతంగా నిర్వహిస్తారు. చిన్నారులను పెళ్లి కుమార్తెలుగా అలంకరిస్తారు. వాళ్ల ఆచారం ప్రకారం వివాహానికి వినియోగించే వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం తండ్రులు తమ ఆడపిల్లలను మెడపై కూర్చోపెట్టుకుని ఊరంతా ఊరేగిస్తారు. తర్వాత 20 రాటలతో వేసిన పందిరిలో పెళ్లి తంతుని ర్వహిస్తారు. 20 రాటలకు ఒక్కో రాటకు 9 కుండలు చొప్పున కడతారు. మధ్యలో ఉన్న రాటకు మాత్రం 11 కుండలు కడతారు. చిన్నారులను మధ్యలో ఉంచి తలపై నుంచి నీళ్లు పోస్తారు. అలా చేయడంతో వాళ్ల ఆచారం ప్రకారం వివాహం జరిగినట్టు భావిస్తారు.
ఎక్కడెక్కడో స్థిరపడిన బంధువులు, చుట్టాలు గ్రామానికి చేరుకుంటారు. పెళ్లికి కావాల్సిన వస్తువులుకూడా తెచ్చి సహాయపడతారు. గ్రామస్థులందరికీ భోజనాలు పెట్టుకుంటారు. ముఖ్యంగా చాలా తెగల్లో ఒక ఆచారం ఉంది. పెళ్లికాని, దినకార్యం లాంటివి జరిగినప్పుడు వచ్చిన వారంతా బియ్యం, కూరగాయలు, నూనె వంటివి తెచ్చి సాయపడతారు. యుక్త వయసు వచ్చాక మామూలుగా పెళ్లి జరుపుతారు. ఈ తెగలో అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే చాలు వివాహం జరపడం ఆచారం. కట్నాలు, కానుకల వ్యవహారం ఉండదు.
‘‘ చిన్నారులకు మూడు సార్లు పెళ్లిళ్లు చేస్తాం. ఇది మాకు ఆచారంగా వస్తోంది. మా పూర్వీకులు ఇలా ఎందుకు పెట్టారో మాకు తెలియదు. కాని ఇది మాకు పండుగ లాంటిది. ఈ పెళ్లిళ్లకు ఎక్కడ ఉన్నా వస్తాం’’ అని చెపుతారు మాలిస్ తెగకు చెందిన మహిళలు. ‘‘ఊరంతా భోజనాలు పెట్టుకుంటాం. బంధువులంతా ఎవరికి తోచింది వారు తీసుకొస్తాం… ఈ విధంగా ఆచరించకపోతే చాలా పెద్దతప్పుచేసినట్టే.. తెగ పెద్దలు ఆగ్రహానికి గురికావాల్సిదే. ఈ కాలంలో పెళ్లికి రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది.’’ అంటూ చెబుతారు మాలి తెగ గిరిజనులు.