టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహార్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఒకేరకమైన వస్త్రధారణతో కనిపిస్తారాయన. ఎప్పుడూ ఖరీదైన చేతి గడియారాలు గానీ బంగారు ఉంగరాలు గానీ ధరించడం ఆయనకు అలవాటు లేదు. అయితే చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో మాత్రం ఆయన చేతివేలికి ఉన్న ఓ ప్లాటినం ఉంగరం అందరినీ ఆకర్షించింది. దానిపై పార్టీ కార్యకర్తలు అడగడంతో దాని ప్రత్యేకత ఏంటో స్వయంగా చంద్రబాబు వారికి తెలిపారు.
అందులో ఓ కంప్యూటర్ చిప్ ఉంటుందని, అది తన రోజువారీ కార్యక్రమాలను అన్నింటినీ కంప్యూటర్కు పంపిస్తుందని, తాను ఎన్నిగంటలు పనిచేసిందీ, ఎన్నిగంటలు నిద్రపోయిందీ అన్నీ రికార్డు చేస్తుందని, అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మరిన్ని పరికరాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని కూడా చంద్రబాబు వెల్లడించారు. ఏమైనా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా అని అందుకే అందరూ అంటారేమో కదూ..!