- బలపడుతున్న అల్పపీడనం
- ఉత్తరాంధ్ర కు పొంచి ఉన్న ముప్పు
రాష్ట్రంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా వాయవ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం కేంద్రీకృతమయింది. ఇది రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తర్వాత ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ, వాయవ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ, విపత్తుల సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో పలుచోట్ల రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తీరం వెంట పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని..పెను గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారింది. రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. ఇప్పటికే పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి.