ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేకా హత్య కేసును తనపై వేసుకుంటే శంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ రెడ్డి.. అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనంతపురం జిల్లా యాడికిలో అతను చనిపోయాడు. గంగాధర్రెడ్డి రాత్రి నిద్రలోనే మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జైళ్లో ఉన్న.. దేవిరెడ్డి శంకర్రెడ్డికి గంగాధర్రెడ్డి అనుచరుడు. గంగాధర్రెడ్డిని గతంలో సీబీఐ అధికారులు ముడుసార్లు విచారించారు. ముడుసార్లు కడప నగరానికి పిలిపించుకుని ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్ 2న సీఆర్పీసీ(CRPC) 161 సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్య కేసును తన పైన వేసుకుంటే శంకర్ రెడ్డి పది కోట్లు ఇస్తానని చెప్పినట్లు సీబీఐకు గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. అయితే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయడానికి గంగాధర్ రెడ్డి నిరాకరించాడు. ఆ తర్వాత సీబీఐ అధికారుల పైనే అనంతపురం ఎస్పీకి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణహాని ఉందని రెండుసార్లు ఎస్పీని కలిశాడు. రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని కోరాడు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పులివెందులలో రౌడీషీటర్ జాబితాలో గంగాధర్రెడ్డి పేరు ఉంది. ఇతనిని కడప జిల్లా నుంచి బహిష్కరించగా.. అతను అనంతపురం జిల్లా యాడికి వచ్చి నివసిస్తున్నాడు. ఈ కేసులో ప్రతి అంశం సంచలనం సృష్టిస్తోంది. గంగాధర్ రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా.. ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో నివసిస్తున్నారు. గంగాధర్ రెడ్డి గతంలో తనకు ప్రాణముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని రెండు మూడు సార్లు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ గతంలో చెప్పారు. కానీ పోలీసులు అతనికి రక్షణ కల్పించలేదు. ఈ క్రమంలో గంగాధర్ రెడ్డి మృతి కలకలం రేపుతోంది. పలు అనుమానాలకు తావిస్తోంది.