“ఒకాయన కండకావరం కొద్దీ బట్టలు విప్పేసారు. బరితెగించిన సదరు ప్రజాప్రతినిధిపై చర్యలు ఉండవని చెప్పించడానికి రాజకీయ అధికారం, పోలీసు వ్యవస్థ బట్టల్ని బట్టల్ని విప్పించేసినట్లుంది “
ఆంధ్ర ప్రదేశ్ లో అధికార ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపకుండానే మార్ఫింగ్ అని అనంతపురం ఎస్పీ ఎలా తేల్చేస్తారు? ఇదీ ఇపుడు ఏపీలో మేధావులు, రాజకీయ నాయకులూ, జర్నలిస్టులను వేధిస్తున్న ప్రశ్న.
మాధవ్ నగ్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామని హోంమంత్రి తానేటి వనిత, వైకాపా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇప్పటివరకూ చెప్పిన మాటలన్నీ వట్టివేనని తేలిపోయింది. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ప్రెస్మీట్లో ఈ విషయం వెల్లడించడంతో అది బయటపడింది. దీంతో SP చెప్పిన విషయాలపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఎంపీ గోరంట్ల మాధవ్కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు’ అని ఒకసారి.. ‘వీడియోను సామాజిక మాధ్యమాల్లో పలుమార్లు ఫార్వర్డ్, రీ పోస్టు చేయటం వల్ల అది ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నాం’ అని మరోసారి ప్రెస్మీట్లో పొంతనలేకుండా చెప్పారు.
” బాధితులు ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదు. వారు ఫిర్యాదిచ్చి ఒరిజినల్ వీడియో ఇస్తే దాని ఆధారంగా యాక్షన్చ తీసుకుంటాం” అని ఎస్పీ చెప్పడంలో ఆంతర్యమేమిటి?
ఈ వీడియో వ్యవహారంపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుని, 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీని ఆదేశించారు కదా! మరి దాని ఆధారంగా ఎంపీపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఈ విషయాన్ని ఎస్పీ ఫకీరప్ప విస్మరించారు.
‘ అసలు నిర్ధారణే కాకుండా.. అది ఒరిజినల్ కాదని.. ఎడిటింగ్, మార్ఫింగ్ అనే అనుమానాలున్నాయని ఎస్పీ ఎలా చెబుతారు? ముందే ఓ నిర్ణయానికి వచ్చేసి దర్యాప్తు ప్రారంభిస్తే అటువంటి విచారణ కరెక్ట్ గా జరుగుతుందా?
బాధితులు ఎవరూ ఫిర్యాదు ఇవ్వకుండా ఎంపీ ఫోన్ ఎలా సీజ్ చేస్తాం? అని చెప్పడం కూడా పోలీసులపై మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఫిర్యాదు రాలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫోన్ సీజ్ చేయలేదు సరే.. బాధితురాలు ఇప్పుడు ముందుకొచ్చి ఫిర్యాదిస్తే… దాని ఆధారంగా ఫోన్ సీజ్ చేసినా అందులో ఆధారాలు లభిస్తాయా? అవి ఇప్పటికే ధ్వంసం అయ్యి ఉండొచ్చు కదా! బాధితులు ధైర్యంగా ఫిర్యాదు ఇవ్వటానికి ముందుకు రండి అని ఇప్పటివరకూ పోలీస్ వ్యవస్థ ఎందుకు భరోసా ఇవ్వలేదు?
ఐటీడీపీ అఫీషియల్ వాట్సప్ గ్రూపులో ఈ వీడియో పోస్టు కాకముందు.. అయిదుగురు దాన్ని ఫార్వర్డ్ చేసినట్లు గుర్తించామని ఎస్పీ చెప్పారు. వారిని పట్టుకుంటే అసలైన వీడియో బయటకు వచ్చే అవకాశం ఉంది కదా! ఆ దిశగా పోలీసులు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సమాధానం లేకుండా మిగిలిపోతున్నాయి. పోలీస్ వ్యవస్టపై మాయని మచ్చ పడింది. ఇప్పటికైనా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సిన్స్పీయర్ గా దర్యాప్తు చేసి పోలీసు వ్యవస్తకు అంటుకున్న మరకను వదిలించుకోవాలి.