ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు టీటీడీపీ(TTDP) నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షాతో(Amit Shah) చంద్రబాబు సమావేశం తరువాత ఆయన టీటీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. తెలంగాణలో టీటీడీపీ తమకు సహకరించడమో లేక పొత్తు పెట్టుకోవడమో చేయాలని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు సూచించారని.. ఇందుకు చంద్రబాబు కూడా సంసిద్ధత కూడా వ్యక్తం చేశారని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు తర్వాత… ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు గురించి ఆలోచిద్దామని బీజేపీ పెద్దలు చెప్పినట్టు సమాచారం.
వీటిని ఆయా పార్టీల నేతలు ధృవీకరించకపోయినా.. ఆ భేటీ జరిగిన రెండు రోజుల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశం కావడంతో ఈ వార్తలకు ఊతమిస్తోంది. తెలంగాణలో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై చంద్రబాబు టీటీడీపీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీలో పెద్దలు తనతో ఏం చెప్పారనే విషయం వారికి చెప్పి.. వారి నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.