భయ గోదావరి లంక గ్రామాల్లో తగ్గిన వరద
అయినా జలదిగ్బంధంలోనే ఇళ్లు, పంటలు
గోదావరి వరదకు ఉభయ గోదావరి జిల్లాల జనం అతలాకుతలం అవుతోంది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని గ్రామాలు కకావికలమయ్యాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గ్రామాలు నేడు బురదతో నిండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు గోదావరి మహోగ్రరూపానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా నీట మునిగిన ఇళ్లు ఇప్పుడిప్పుడే బయల్పడుతున్నాయి. వారం రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులు ఇళ్లకు వెళ్తున్నారు. అయితే, తమ ఇళ్లు నేలకొరిగిపోయి ఉండడం, గోడలు దెబ్బతినడం, బురద పేరుకు పోవడం వంటి దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇళ్ల లోపల, బయట బురదమయంగా మారింది. పూరిళ్లు రూపురేఖలు కోల్పోయాయి. తలుపులు, ఇంట్లో ఉంచిన సామాగ్రి సైతం వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. విద్యుత్ తీగలు ఎక్కడకక్కడ తెగిపడ్డాయి. గ్రామాల్లో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. మళ్లీ ఎప్పటికి తేరుకుంటామోనని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘ఏటా గోదావరి వరదలకు భయపడుతూ బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చిన గోదావరి మాలాంటి వారి జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. పోలవరం పరిహారం ఇచ్చి పంపిస్తే ఇక్కడ నుండి వెళ్లి మా బతుకులు మేం బతుకుతాం’ అని కుక్కునూరుకు చెందిన నిర్మలా నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సీహెచ్ సుధీర్కుమార్రెడ్డి ఆదేశాలిచ్చారు. వరద ప్రత్యేకాధికారిగా నియమితులైన మురళీధర్రెడ్డి తాళ్లరేవు మండలంలోను, కలెక్టర్ హిమాన్షు శుక్లా పి.గన్నవరం మండలంలోను వరద ప్రాంతాల్లో పర్యటించారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వెంబడి ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా గండం గట్టెక్కిదంటూ గోదారమ్మకు పూజలు చేస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం రూరల్ మండలంలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.
ఖాళీ అవుతున్న పునరావాస కేంద్రాలు
వశిష్ఠ గోదావరికి వరద తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాల్లోని వారు నెమ్మదిగా తమ ఇళ్లకు చేరుతున్నారు. అయితే, లంక గ్రామాలు మాత్రం ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆచంట మండలంలో 9, యలమంచిలి మండలంలో 6, నరసాపురం మండలంలో రెండు, పట్టణంలోని చినమామిడిపల్లి, లాకుపేటల్లో ఇంకా వరద వీడలేదు. పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో సాధారణ స్థితికి చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. బియ్యం, కూరగాయలు, పాల ప్యాకెట్లను ఆయా సంస్థల వలంటీర్లు పంపిణీ చేస్తున్నారు.