“రానున్న రోజులలో భారత్ కూడా ఆర్ధిక మాంద్యం దెబ్బ నుంచి తప్పించుకోజాలదు. పలువురు ఆర్ధిక నిపుణులు ఇవే హెచ్చరికలు చేస్తున్నారు..”
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్చార్డీ)లో నిర్వహించిన అభయ్ త్రిపాఠి స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రూపాయి మారక విలువ పడిపోవడం వల్ల పెద్దగా ఆందోళన లేదని.. అది సాధారణమేనన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన దూరదృష్టికి కితాబిచ్చారు. ‘‘సైబరాబాద్ నిర్మాణం వెనక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. ఆయన ఓ బోల్డ్ అండ్ అన్యూజువల్ పర్సన్. ఆనాడు చంద్రబాబు అమలు చేసిన సంస్కరణల ఫలితమే.. ఇప్పుడు సైబరాబాద్ అనే ఖ్యాతిగా కనిపిస్తోంది.
ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా ఆయనకు థాంక్స్ చెప్పాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఢిల్లీ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ను కలిసేందుకు బాబు విశ్వప్రయత్నం చేశారన్నారు. ‘‘తనను తాను ఆంధ్రప్రదేశ్ సీఈవోగా పరిచయం చేసుకుని, అపాయింట్మెంట్ తీసుకున్నారు. అతి కష్టమ్మీద బిల్గేట్స్ అపాయింట్మెంట్ దొరికింది. చంద్రబాబు 90 నిమిషాలు ఆయనకు తన ప్రణాళికను వివరించారు. అంతే.. బిల్గేట్స్ చంద్రబాబు వెంట హైదరాబాద్కు వచ్చారు’ అని గుర్తుచేశారు. బిల్ గేట్స్ ఇక్కడకు వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ ఫోకస్ మారిపోయింది. ఐటీ లో భారత్ లోనే అత్యంత కీలక హబ్ గా మారిపోయింది.