“ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు అందరినీ రంగంలోకి దించుతారు. కానీ, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వ్యవస్థలు మాత్రం పని చేయవు. ఇదీ రాష్ట్రంలో జగనోహన్ఎం రెడ్డి పాలన. జగన్ ని ప్రజలు ఎలా నమ్మారో నాకు అర్ధం కావడంలేదు..” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్ చేసారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మూడో విడత జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. వైసీపీ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు.
‘‘151 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చు. రాష్ట్రంలో అనేక సమస్యలుంటే ఒక సినిమా రిలీజ్కు .. చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్లు, ఆర్డీవోల వరకు మొత్తం యంత్రాంగాన్ని తిప్పగలరు. కానీ ఇళ్ల పట్టాలు, టిడ్కో హౌసింగ్ సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు వ్యవస్థలు ఎందుకు పనిచేయవు. ఎందుకంటే.. వీటిపై వారికి శ్రద్ధ ఉండదు. ప్రత్యర్థులపై దాడి చేయాలంటే కలెక్టర్, చీఫ్ సెక్రటరీ అందరూ ముందుకొస్తారు. 5, 10, 15 రూపాయల సినిమాల కోసం వ్యవస్థను మొత్తం నడపగలరు కానీ, సగటు మనిషి సమస్యల పరిష్కారానికి ఎందుకు బయటకు రారు.“ అని ప్రశ్నించారు.
మధ్య నిషేధం ఎక్కడ?
“దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఉన్నా పింఛను ఇవ్వట్లేదు. తూతూ మంత్రంగా కొంతమందికి ఇచ్చి వదిలేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారు. మేం కూడా ఇక్కడ పెరిగిన వాళ్లేమే. మేమేదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచో, న్యూయార్క్.. బాస్టన్ లాంటిచోట పెరగలేదు. ఆంధ్రాలోనే పెరిగాం. అన్నొస్తే అద్భుతాలు జరగుతాయన్నారు. కానీ, ఎక్కడా జరగడంలేదు. మద్యపానం నిషేధం అన్నారు ఏదీ? ఎక్కడ? ఇంకా చెప్పాలంటే మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు..“ అని ఎద్దేవా చేశారు.
మాటల మామయ్య!
“యువత మధ్య వ్యక్తిగతంగా అనేక భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ, ప్రజా సమస్యలపై అందరూ ఏకమై పోరాడాలి. ఇన్నేళ్లుగా భీమవరం డంపింగ్యార్డు సమస్య ఎందుకు పట్టించుకోరు. చేయాలని చిత్తశుద్ధిలేదు వీళ్లకు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చాలా పనులు చేయొచ్చు. తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ గురించి ముద్దుల మావయ్య బాగా చెప్పారు. అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు. మావయ్యకు జేబులో నుంచి డబ్బులు తీయడం రాదు కానీ, నోటి నుంచి మాటలు మాత్రం బాగా వస్తాయి’’ అని పవన్ విమర్శించారు. రానున్న రోజులలో ప్రజలు జగన్ ని తిప్పి కొడతారని అన్నారు.